ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో అత్యాచారానికి గురైన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ఓ నాయకురాలు నికిత మాట్లాడుతూ ‘‘ బెలగల్ మండలానికి చెందిన ఓ విద్యార్థిని పత్తికొండలో ఓ హాస్టల్లో ఉండి చదువుతోంది. అనారోగ్యం పాలవటంతో తన తల్లితో కలిసి ఎమ్మిగనూరులో చికిత్స పొంది తిరిగి ఒంటరిగా హాస్టల్ కి వస్తున్న సమయంలో, ఒక ఆటో డ్రైవర్ ఆటో ఎక్కించుకొని, మాయమాటలు చెప్పి ఆమెని అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది. ఈ అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని సబ్ కలెక్టర్ ని కోరడం జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అత్యాచార ఘటనల పరంపర కొనసాగుతోంది. నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి నిందితులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారైతే కఠినంగా శిక్షిస్తామని, కఠినమైన చట్టాలు తీసుకొస్తామని పాలకులు అంటున్నారు. కానీ ఈ అత్యాచారాలకు, లైంగిక దాడులకు మూల కారణమైన మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల సినిమాలు, వీడియోలను నిషేధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు సరికదా, దగ్గరుండి మరీ పెంచి పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) గా కళాశాల విద్యార్థిని పై జరిగన అత్యాచారాన్ని ఖండిస్తున్నామని’’ తెలిపారు. పిడిఎస్ఓ సభ్యులు శ్రావణి మాట్లాడుతూ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం ఒక రోజుకి ఈ దేశంలో 86 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రమే. ఇంకా బయటకు రాని ఘటనలు అనేకం. ఇటువంటి ఘటనలన్నింటిలో కూడా మనం పరిశీలిస్తే నిందితులంతా ఈ దారుణానికి ఒడిగట్టే ముందు అశ్లీల సినిమాలు, వీడియోలు చూసి ఉండటం లేకపోతే మద్యం, మత్తుపదార్థాలు సేవించి ఉండడము జరుగుతుంది. ఈ హత్యలు అత్యాచారాలకు మూల కారణాలైన ఈ మద్యం మత్తుపదార్థాలు, అశ్లీల సినిమాలను నిషేధించనంత కాలం ఈ అత్యాచారాలు నిర్మూలించబడవు. ‘ ప్రభుత్వాలు చేయవలసింది కఠినమైన చట్టాలను తీసుకురావటం మాత్రమే కాదు. వీటికి మూల కారణాలైన వీటన్నింటినీ ముందుగా నిషేధించాలని, పిడిఎస్ఓగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావంతి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని పై ఆటో డ్రైవర్ చేసిన అత్యాచారాన్ని ఖండిరచండి
