LBF News

/ Sep 23, 2025

ప్రజాస్వామ్యానికితీవ్ర ముప్పు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని, సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్ఖర్‌…న్యాయవ్యవస్థను కించపర్చే రీతిలో వ్యాఖ్యల దాడి చేయడం దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ధ్వజమెత్తారు. దేశంలో నాడు ఎమర్జెన్సీకి ముందున్న ప్రమాదకర, విపత్కర పరిస్థితులు నడుస్తున్నాయని, వాటిని అంతం చేయకుంటే… మరింత తీవ్ర రూపందాల్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి శుక్రవారం రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. గవర్నర్లలో అందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లేనని, దీంతో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు అమలు చేసిన బిల్లుల్ని అమలు చేయకుండా, ఏళ్ల తరబడి తొక్కిపట్టి… ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వైఖరిని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులో తప్పుపట్టిందని, అలాంటి బిల్లులను తొక్కిపెట్టే అధికారం గవర్నర్లకు లేదని తేల్చిచెప్పిందన్నారు. ఈ తీర్పును దేశంలోని ప్రజ్వామ్య వాదులంతా స్వాగతించగా… అది జీర్ణించుకోలేని భారత ఉపరాష్ట్రపతి ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్‌ సవరణ బిల్లు విషయంలోనూ అదే ధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. దానిపై సుప్రీంకోర్టు…వక్ఫ్‌బోర్డులో అన్యమతస్తులకు స్థానం కల్పిస్తే…దేవాలయ కమిటీల్లోను ఇతరులను పెడతారా? అని ప్రశ్నించిందన్నారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ…లౌకికవాదులు, ప్రజాస్వామిక వాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా… దానిపైనా ఉప రాష్ట్రపతి అవమానించేలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, ఇది సుప్రీంకోర్టుపై దాడి చేయడమేనని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్‌, న్యాయవ్యవస్థకు దేనికుండే అధికారాలు దానికే ఉంటాయని రామకృష్ణ వివరించారు. వచ్చిన బిల్లులు రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా? లేదా? అనే దానిపై తీర్పు చెప్పే బాధ్యత అంతిమంగా న్యాయవ్యవస్థదేనని స్పష్టంచేశారు. సెక్యులర్‌ వ్యక్తులుగా ఉన్న సీఎంలు చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ ప్రమాదకరమైన వక్ఫ్‌ సవరణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇచ్చి..దేశ వ్యాప్తంగా చిచ్చుపెట్టేలా మారారని, వాస్తవంగా వాళ్లు తలచుకుంటే ఆపేవాళ్లని చెప్పారు. రాజ్యాంగ మనుగడకు విఘాతం కలుగుతున్న ఈ తరుణంలోనైనా చంద్రబాబు ముందుకు వచ్చి… ఈ ప్రతిష్టంభన నుంచి బయటపడడానికి చొరవ చూపాలని కోరారు. దేశంలో ఎక్కడికక్కడ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారని వివరించారు. దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టుపై ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలపై, వక్ఫ్‌ సవరణ చట్టంపై, రాష్ట్రాల అధికారాలపైన చర్చ జరుగుతుంటే…ఇవన్నీ పక్కన పెట్టి…రాష్ట్రంలో తిరుపతిలో పక్కా కామెడీ రాజకీయాలు నడుస్తున్నాయని ఎద్దేవాచేశారు. ఎంతసేపూ తిరుపతిలో ఆవులు చనిపోవడం నుంచి నాడు లడ్డూలో కల్తీ సంఘటనలపైనే చర్చ జరుగుతోందన్నారు. ఆవులు వయస్సుమీరి, అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం సహజమేనని… దానిపై టీటీడీ పూర్వపు చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి చర్చకు పట్టుపడితే… కూటమి పార్టీలు స్వీకరించి ఆయన సూచనలు తీసుకోవడం లేదా అందరూ చర్చించి చర్యలు తీసుకుంటే సరిపోదా అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.